RRB JE Recruitment 2024 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) మరోసారి భారీగా ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనుంది. ఈ ప్రక్రియ ద్వారా సుమారుగా 8వేల జూనియర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. ఇందుకు గాను అభ్యర్థులు rrbald.gov.in అనే వెబ్సైట్ను సందర్శించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఇక ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మొత్తం 7951 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 30, 2024న ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ ఆగస్టు 29న ముగియనుంది. ఆలస్య రుసుము చెల్లించి సెప్టెంబర్ 8, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఖాళీల విషయానికి వస్తే.. కెమికల్ సూపర్వైజర్ లేదా రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్ వైజర్ పోస్టులు 17, జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు 7934 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు గాను వయో పరిమితిని 18 నుంచి 36 ఏళ్లుగా విధించారు. మరిన్ని విద్యార్హతల వివరాలకు పైన ఇచ్చిన వెబ్సైట్ను సందర్శించవచ్చు.

సీబీటీ ద్వారా ఎంపిక..
ఈ ఉద్యోగాలకు గాను కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (సీబీటీ) ద్వారా ఎంపిక ఉంటుంది. అలాగే డాక్యుమెంట్లను సైతం వెరిఫై చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ మొదటి దశ, రెండో దశ ఉంటాయి. వీటిల్లో ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు నెగెటివ్ మార్కులు ఉంటాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. మొదటి దశ సీబీటీకి హాజరైన తరువాత బ్యాంకు ఛార్జిలను మినహాయించి రూ.400 తిరిగి ఇస్తారు. ఇక దరఖాస్తు రుసుమును నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా యూపీఐ ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చు. ఇందుకు గాను వర్తించే సర్వీస్ చార్జిలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ను విజిట్ చేయవచ్చు.