ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే యువతకు మరోవైపు ఉద్యోగావకాశాలను కూడా కల్పిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. యువతకు ఉపాధే ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారిగా 10వ తరగతి మొదలుకొని ఆపై చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఉద్యోగాల మేళాలను నిర్వహిస్తున్నారు. కొన్ని వందల మందికి ఈ మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని జూనియర్ ప్రభుత్వ కళాశాలలో ఈ నెల 20వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ మినీ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఇందులో క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ లిమిటెడ్, నవభారత్ ఫెర్టిలైజర్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ వంటి 3 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి.
10వ తరగతి నుంచి బీఎస్సీ, ఎంబీఏ లేదా ఏదైనా డిగ్రీ చదివిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఈ నెల 20వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభం అవుతుంది. ఇందుకు సంబంధించి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాట్లు చేశారు. ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు, యువత సద్వనియోగం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ మేళాలో ఎంపికైన వారికి ఉద్యోగి అర్హతను బట్టి జీతం రూ.10 వేల నుంచి ఏడాదికి రూ.4 లక్షల వరకు ఇస్తారని తెలిపారు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, విద్యార్హత జిరాక్స్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్టు సైజ్ ఫొటోతో హాజరు కావాలని తెలిపారు.
ఈ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు డ్రెస్ కోడ్ను పాటించాల్సి ఉంటుంది. ఫార్మల్ డ్రెస్లో రావల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఎన్ శ్రీనివాసులు ఫోన్ నంబర్ 7799494856 లేదా ఎం.మల్లికార్జున ఫోన్ నంబర్ 9542735717 లలో సంప్రదించవచ్చని తెలిపారు.