తెలంగాణలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీగా ఉన్న యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 842 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ మేరకు ఆయుష్ శాఖ నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. అయితే ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. మొత్తం 842 పోస్టుల్లో 421 పోస్టులను పురుష అభ్యర్థులతో, మరో 421 పోస్టులను మహిళా అభ్యర్థులతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వీరు సెషన్ల వారిగా విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రతి సెషన్ గంట సేపు ఉంటుంది.
ఒక్కో సెషన్కు రూ.250 చొప్పున రెమ్యునరేషన్ చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://ayush.telangana.gov.in/ అనే వెబ్సైట్ ను సందర్శించవచ్చు. యోగా పురుష ఇన్స్ట్రక్టర్లు నెలకు కనీసం 32 యోగా సెషన్లకు అటెండ్ అవ్వాలి. మహిళా యోగా ఇన్స్ట్రక్టర్లు నెలకు కనీసం 20 యోగా సెషన్లకు హాజరు కావాల్సి ఉంటుంది. దీని వల్ల పురుష యోగా ఇన్స్ట్రక్టర్లకు నెలకు రూ.8వేల వరకు, మహిళా యోగా ఇన్స్ట్రక్టర్లకు నెలకు రూ.5వేలు లభిస్తాయి.
ఈ పోస్టులను కేవలం విద్యార్హతలు, ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే భర్తీ చేస్తారు. వరంగల్ జోన్లో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో ఇంటర్వూలు ఉంటాయి. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీల మధ్య ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. అభ్యర్థులు మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే పైన ఇచ్చిన వెబ్సైట్ను విజిట్ చేయాల్సి ఉంటుంది.